దేశ భాషలందు తెలుగు లెస్స - ఈ వ్యాక్యం ప్రతి ఒక్కరికి సుపరిచితమే!! ఆంధ్రభోజుడిగా, సాహితీసమరాంగణ సార్వభౌముడిగా వెలిగొందిన శ్రీ కృష్ణదేవరయులవారి పలుకులవి. ఆయన రచించిన "ఆముక్తమాల్యద" తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక ఆణిముత్యంగా మిగిలిపాయింది. ఇంక అష్టదిగ్గజాలుగా పేరుగాంచిన విజయనగర కవుల మణిపూసలు ఎన్నో!! ఆస్థానంలో వెలసిన అష్టదిగ్గజాలకు - ఆయనకు నడుమ జరిగిన రసవత్తరమైన సంభాషణలు అనేకం మనకు అందుబాటులో లేకపోవడం మన దురదృష్టమనే అనుకోవాలి!!! మరి అందుబాటులో వున్న కొన్ని సంభాషణల విషయానికి వస్తే నాకు ముందుగా స్మృతికి వచ్చేది ఆదిత్య 369 చిత్రంలోని ఒక సన్నివేశం. సింగీతం శ్రీనివాస రావుగారి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలోని విజయనగర సామ్రాజ్యపు చిత్రణ అమోఘం. బహుశా విజయనగర సామ్రాజ్యం ఇలాగె వుండేదేమో అని తలపించేలా వుంటుంది. అందులో రాయలవారు తమ మదికి వచ్చిన ఒక అందమైన ఊహను పూరించవలసిందిగా అష్టదిగ్గజాలను కోరుకుంటారు.
"బలరాముడు సీతను చూసి ఫక్కున నగియెన్"
అన్నదే ఆ ఊహ. త్రేతాయుగానికి ద్వాపరయుగానికి ముడిపెట్టిన ప్రభువుల సమస్యను పూరించడం ఎలా అని అందరూ ఆలోచిస్తుండగా....
"లలనలు పాయసమానిన కల్గుదురే పిల్లలనుచు క్ష్మాసుత నవ్వన్....
పొలమున దొరికెదరని ధీబల రాముడు సీతజూచి ఫక్కున నగియెన్!!"
అని వికటకవిగా ప్రసిద్ధిగాంచిన తెనాలి రామకృష్ణ దాన్ని ఈ విధంగా తన సాటిలేని చతురతతో "బలరాము"ని "ధీబలరాము"ని చేసి పూరిస్తారు....
నారాయణస్వామిగారి సహకారంతో ఆ పద్యంయొక్క వివరణ :
ఇక్కడ క్ష్మాసుత; క్ష్మ = భూమి, భూమి పుత్రిక సీత .
స్త్రీ పాయసం తాగితే పిల్లలు పుడతారా అని సీతాదేవి నవ్విందిట. దానికి బదులుగా రాముడు, అబ్బే, భూమిని దున్నినప్పుడూ దొరుకుతారు అని కొంటెగా జవాబిచ్చాడు. రాముడు, అతని సోదరులు, వారి తండ్రి యజ్ఞం చెయ్యగా వచ్చిన పాయసాన్ని తల్లులకి ఇస్తే పుట్టిన వారు. అలాగే జనకమహారాజు యజ్ఞశాలకోసం భూమిని దున్నుతుండగా ఆ నాగటి చాలులో సీతాదేవి పాపాయిగా దొరికింది. ఆ ఇద్దరి జన్మ వృత్తాంతాల్ని వారు దంపతులైన తరవాత వారి మధ్య సరస సంభాషణలాగా ఈ పద్యం రాశారు.